న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నా అక్కడి ప్రభుత్వాలను కూలుస్తూ అధికారం లాక్కుంటున్న భారతీయ జనతాపార్టీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిప్పులు చెరిగారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మాట్లాడిన ఆయన.. భారతీయ జనతాపార్టీని ప్రభుత్వాలను హత్య చేసే సీరియల్ కిల్లర్గా అభివర్ణించారు.
భారతీయ జనతాపార్టీ దేశంలో ఇప్పటికే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన చాలా ప్రభుత్వాలను కూలదోసింది. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ కన్ను ఢిల్లీ ప్రభుత్వంపై పడింది. ప్రభుత్వాలను హత్యచేసే సీరియల్ కిల్లర్ బీజేపీ. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ఆ పార్టీ ప్రభుత్వాలను కూల్చే తీరు ఒకేవిధంగా ఉన్నది అని ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా కేజ్రివాల్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్పై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా ప్రసంగించిన కేజ్రివాల్ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని చెప్పారు. ఇంత డబ్బు బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు.
ఆప్ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని, ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇవ్వడానికి ఆశ చూపిందని ఆయన ఆరోపించారు. ప్రజలపై పన్నులు వసూలు చేసి వచ్చిన సొమ్మును ఎమ్మెల్యేల కొనుగోలుకు వినియోగిస్తున్నారని, కోటీశ్వరులైన బీజేపీ మిత్రులకు రుణాలు మాఫీ చేస్తున్నారని కేజ్రివాల్ విమర్శించారు.