బీజేపీకి అధికార మత్తు తలకెక్కింది. ప్రతిపక్షాలను అణచివేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నది. మద్యం పాలసీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయి అనేందుకు ఒక్క ఆధారం కూడా లేదు. ముమ్మాటికి ఈ కేసు అబద్ధం, కల్పితం. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind kejriwal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మద్యం పాలసీ కేసు పూర్తిగా ఫేక్ అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విచారణలో సీబీఐ అధికారులు తనను 56 ప్రశ్నలు అడిగారని తెలిపారు. మద్యం పాలసీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనేందుకు ఒక్క ఆధారం కూడా లేదని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. సీబీఐ సమన్ల జారీ మేరకు కేజ్రీవాల్ ఆదివారం విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ కొనసాగింది. అనంతరం ఇంటికి చేరుకొన్న తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ మద్యం పాలసీ కేసు అబద్ధం, కల్పితం’ అని అన్నారు. నిజాయితీనే తమ సిద్ధాంతమని, చావనైనా చస్తాం గానీ, నిజాయితీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తమను, తమ అభివృద్ధి పనులను అప్రతిష్ఠ పాల్జేసేందుకు వారు(కేంద్ర ప్రభుత్వం) ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ విచారణ మధ్యాహ్నం సుమారు 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. విచారణకు హాజరయ్యే ముందు కేజ్రీవాల్ ఆప్ మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాజ్ఘాట్ వద్దకు చేరుకొని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్మాన్తో పాటు ఆప్ ఎంపీలు, ఇతర నేతలు ఉన్నారు. కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్తో పాటు ఆప్ కార్యాలయం వద్ద భారీఎత్తున పోలీసులను మోహరించారు. ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు.
సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లేముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అంతకుముందు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బీజేపీకి అధికార మత్తు తలకెక్కిందని, ప్రతిపక్షాలను అణచివేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. మద్యం పాలసీలో ఎటువంటి తప్పు లేదని, అటువంటప్పుడు దాచిపెట్టేందుకు ఏముంటుందని అన్నారు. ‘నన్ను అరెస్టు చేయాలని కేంద్రం ఆదేశిస్తే.. సీబీఐ తప్పకుండా ఆ పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. తాను దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమన్నారు.
సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆప్ నేతలు, కార్యకర్తలు రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పంజాబ్ సీఎం భగవంత్మాన్, ఢిల్లీ మంత్రులు, ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్చద్దాతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేసి, కేజ్రీవాల్ విచారణ ముగిసిన అనంతరం వదిలిపెట్టారు. ఢిల్లీవ్యాప్తంగా 1,500 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 32 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లతో పాటు 20 మంది పంజాబ్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారని ఢిల్లీ ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. తమను ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకొన్నారని పంజాబ్ ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు వెల్లడించారు.
బీజేపీ అవినీతి, అదానీ కంపెనీల్లో ప్రధాని మోదీ పెట్టుబడుల గురించి కేజ్రీవాల్ ప్రశ్నించినందుకే సీబీఐ ఎంటర్ అయ్యిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. మద్యం పాలసీ కేసులో తమను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నారని నిందితులుగా ఉన్న పలువురు, సాక్షులు కోర్టులకు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. సీబీఐ అధికారులు కోర్టుల్లో అబద్ధాలతో అఫిడవిట్లు వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కేజ్రీవాల్ ఫోబియాతో బాధపడుతున్నదని మరో ఎంపీ రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు.