న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని వాసులకు కీలక హామీలిచ్చారు. పౌర సంస్ధల్లో అవినీతిని నిరోధించడం, చెత్త డంపింగ్ యార్డుల తరలింపు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదల వంటి పలు హామీలిచ్చారు. తామేం చెప్పామో అదే చేస్తామని కేజ్రీవాల్ చెబుతూ ఇతరులు వచన్ పత్ర విడుదల చేశారని, వచ్చే ఏడాది వారు దాన్ని సంకల్ప్ పత్రం అంటారని, ఎన్నికల తర్వాత హామీలు, మేనిఫెస్టోను బుట్టదాఖలా చేస్తారని కాషాయ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, రోడ్లకు రిపేర్లు చేపడతామని, ఎంసీడీ స్కూళ్లు, ఆస్పత్రులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. తాను ఎంసీడీకి నిధులు కేటాయించడం లేదని కాషాయ పార్టీ ఆరోపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర సర్కార్ను కేంద్రం విమర్శించడం చరిత్రలో ఇదే తొలిసారని కేజ్రీవాల్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
ఎంసీడీ ఉద్యోగులకు ఆప్ సకాలంలో వేతనాలు చెల్లిస్తుందని, ఇన్స్పెక్టర్ రాజ్కు తెరదించి సీల్ చేసిన షాపులను ఓపెన్ చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీని చెత్తరహిత నగరంగా మార్చేందుకు కేంద్రం నుంచి నిధులు తెస్తామని హామీ ఇచ్చిన బీజేపీ తన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీకి 20 స్ధానాలు మించి రావని కేజ్రీవాల్ పేర్కొన్నారు.