న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి అతిషిపై బీజేపీ పరువునష్టం నోటీసు(Defamation Notice) జారీ చేసింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాలని, లేదంటే అరెస్టు తప్పదనని ఓ కాషాయ పార్టీ నేత తనను అడిగినట్లు మంత్రి అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనతో పాటు మరో ముగ్గురు ఆప్ వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తారని ఆమె అన్నారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలని ఓ వ్యక్తి ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. మంత్రి అతిషికి డిఫమేషన్ నోటీసు పంపామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ తెలిపారు. తనను ఎవరు ఆశ్రయించారు, ఎప్పుడు ఆ ఘటన జరిగిందో దానికి సంబంధించిన సాక్ష్యాలను అతిషి ఇవ్వలేకపోయినట్లు ఆయన ఆరోపించారు. తన ఆరోపణలను ప్రూవ్ చేసేందుకు ఫోన్ను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సచ్దేవ్ తెలిపారు.