న్యూఢిల్లీ: రెసిడెంట్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓపీడీ వైద్య సేవలను నిలిపివేశారు. నీట్ పీజీ కౌన్సిలింగ్లో ఆలస్యం జరుగుతున్న కారణంగా.. రెసిడెంట్ డాక్టర్లు నిరసన బాటపట్టారు. దేశరాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ఓపీడీ సేవలను ఆపేశారు. దీంతో భారీ సంఖ్యలో రోగులు ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెసిడెంట్ డాక్టర్ల నిరసన వల్ల ఓపీడీ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ను జనవరిలో నిర్వహించాలని భావిస్తున్నారు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి నీట్ పీజీలో కోటా కల్పించాలని ఇటీవల కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఆ కోటాను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు కేసులు నమోదు అయ్యాయి. దీంతో నీట్ పీజీ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రెసిడెంట్ డాక్టర్లు సుప్రీంకోర్టుకు ర్యాలీ తీశారు. ఆ ర్యాలీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు డాక్టర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలను ఖండిస్తూ ఇవాళ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేపట్టారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇవాళ రెసిడెంట్ డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే హాస్పిటల్ క్యాంపస్ నుంచి డాక్టర్లను బయటకు పంపేది లేదని సఫ్దార్జంగ్ ఏసీపీ తెలిపారు. రాజస్థాన్లో కూడా రెసిడెంట్ డాక్టర్లు నిరసన చేపట్టారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని గత నెల రోజుల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, కానీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఇవాళ రెండు గంటల పాటు సేవల్ని నిలిపివేస్తున్నట్లు డాక్టర్ అమిత్ యాదవ్ తెలిపారు.
ఢిల్లీలోని స్వామి దయానంద్ హాస్పిటల్లో కూడా ఓపీడీ సేవల్ని బంద్ చేశారు. సఫ్దార్జంగ్ హాస్పిటల్లో పరిస్థితి దీనంగా ఉంది. వైద్యం కోసం రోగులు ఎదురుచూస్తున్నారు.