న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ కొనసాగుతున్నది. ఆరేండ్ల రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత వారం కొత్తగా 2,569 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 5,277 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 9 మరణాలు సంభవించినట్లు చెప్పారు.
కాగా, 2015 తర్వాత ఢిల్లీలో నమోదైన డెంగ్యూ కేసులు, మరణాల్లో ఇదే గరిష్ఠ సంఖ్య అని గణాంకాలు చెబుతున్నాయి. 2015లో మొత్తం 16,000 మంది డెంగ్యూ బారినపడగా సుమారు 60 మంది మరణించారు. 2016లో 4,431, 2017లో 4,726, 2018లో 2,798, 2019లో 2,036 డెంగ్యూ కేసులు నమోదు కాగా 2020లో కేసుల సంఖ్య 50 శాతం వరకు తగ్గి 1,072 నమోదయ్యాయి.
మరోవైపు ఢిల్లీలో ఈ ఏడాది డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 5,277 కేసులు నమోదు కాగా, ఇందులో ఒక్క నవంబర్లోనే 3,740 కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆసుపత్రులకు డెంగ్యూ రోగుల తాకిడి పెరిగింది. లోక్ నాయక్ ఆసుపత్రిలోని 100 పడకల ఫీవర్ వార్డు 90 శాతం నిండిపోయింది. ఆసుపత్రిలో ప్రతిరోజూ 20 నుండి 30 మంది డెంగ్యూ రోగులు చేరుతున్నారని ఈ నెల 13న ఒక సీనియర్ వైద్యుడు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
కాగా, ఢిల్లీలో 2015 తర్వాత 2017లో గరిష్ఠంగా పది మంది డెంగ్యూ వల్ల మరణించారు. మున్సిపల్ కార్పొరేషన్ల డేటా ప్రకారం ఈ ఏడాది నవంబర్ నాటికి ఈ వ్యాధి బారిన పడి 9 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు పిల్లలే కావడం గమనార్హం.