Delhi’s Nangloi | ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో దారుణం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కి చెందిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం, నంగ్లోయి ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనతో స్తానికులు కోపోద్రిక్తులయ్యారు. ప్రమాదానికి కారణమైన బస్సును ధ్వంసం చేసి, దహనం చేసేందుకు ప్రయత్నించారు.
సోమవారం ఉదయం బస్సు వేగంగా వెళ్తూ స్కూటీపై వెళ్తున్న ఒక యువకుడిని, అలాగే ఇ-రిక్షా కార్మికుడిని, మరికొందరిని ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న యువకుడిపైకి బస్సు ఎక్కడంతో అతడు అక్కడే మరణించాడు. అలాగే మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొందరు గాయపడ్డట్లు సమాచారం. ప్రమాద ఘటనతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బస్సు అద్దాల్ని ధ్వంసం చేశారు. బస్సుకు నిప్పు పెట్టారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడి ఆందోళనకారులను చెదరగొట్టారు. ధ్వంసమైన బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రుల్ని స్థానిక సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో డీటీసీకి చెందిన బస్సులు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. ఒక నివేదిక ప్రకారం 2024-25లో ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి 150 ప్రమాదాలు జరగగా,40 మంది మరణించారు. ఇందులో డీటీసీ బస్సుల వల్లే 97 ప్రమాదాలు జరగగా, 21 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.