(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనత వైఖరి కారణంగా రూ. 3.19 లక్షల కోట్ల జాతి సంపద వృథాగా ఖర్చయ్యింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్ల కాలంలో కేంద్రం పరిధిలోని మొత్తం 1,438 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 835 ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. ఇప్పటికే గడువు పూర్తయినప్పటికీ, వీటి నిర్మాణం ఇంకా పూర్తవ్వలేదు. దీంతో రూ. 3.19 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ మేరకు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంట్కు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
835 ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిజానికి రూ. 10.88 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉన్నది. అయితే, గడువు ముగిసిన కారణంగా వీటి వ్యయం రూ. 14.07 లక్షల కోట్లకు చేరుకొన్నట్టు మంత్రి తెలిపారు. గడువుదాటిన ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం ప్రాజెక్టులు రోడ్లు, హైవే మంత్రిత్వ శాఖ పరిధిలోనివి కాగా, అదనపు వ్యయం ఎక్కువగా చెల్లించాల్సిన ప్రాజెక్టులు రైల్వే శాఖ పరిధిలోనివని మంత్రి వివరించారు.