జమ్ము: జమ్ముకశ్మీర్ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. వైస్ ఎయిర్ చీఫ్, ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో ఫోన్లో మాట్లాడారు. మరో ఉన్నతాధికారి ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ను సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించమని ఆదేశించారు.
జమ్ముకశ్మీర్ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతిన్నది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ముష్కరులు డ్రోన్ల సాయంతో బాంబులు జారవిడిచినట్లు వెల్లడించారు.
పేలుళ్ల సమాచారం అందగానే బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించాయి. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నది. జమ్ము విమానాశ్రయం రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా ఐఏఎఫ్ నియంత్రణలో ఉంటాయి. అందుకే ఈ ఐఏఎఫ్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు జరపుతున్నారు.