Rahul Gandhi | పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట దక్కలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరిస్తూ తుది తీర్పును రిజర్వ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత జస్టిస్ హేమంత ప్రచాక్ తీర్పును వెలువరించింది. అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.
మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 29న రాహుల్ పిటిషన్పై విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వాదనలు వినిపించారు. రాహుల్ వ్యాఖ్యలు రెండేళ్ల జైలు శిక్ష విధించేంత తీవ్రమైన నేరమేమికాదన్నారు.
2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎలా వచ్చింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి గుజరాత్ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేశారు. రాహుల్ తన వ్యాఖ్యలతో మొత్తం మోదీ వర్గం పరువు తీశారని ఆరోపించారు. రాహుల్పై ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద కేసు నమోదయ్యాయి. ఈ పిటషన్పై పలుసార్లు విచారించిన కోర్టు.. మార్చి 23న కోర్టు తీర్పు వెలువరించింది.
సెక్షన్ 504 కింద అతనికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కొద్దిరోజులు సమయం ఇచ్చింది. దాంతో పాటు బెయిల్ను మంజూరు చేసింది. రాహుల్ సూరత్ కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేయగా వాటిలో ఒకటి కోర్టు తిరస్కరించగా, మరొకటి మే 3న విచారణకు రానుంది. రెండేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో లోక్సభ సెక్రెటేరియట్ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేసింది. దాంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ను తిరస్కరించింది.