న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఏకగ్రీవాలతో పాటు తాజాగా విడుదలైన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎగువసభలో కమలదళం బలం 95 నుంచి 92కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్కు 2 సీట్లు పెరిగి ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31కి చేరింది. 57 రాజ్యసభ స్థానాలకుగానూ 41 ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. మిగతా 16 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ మొత్తం 57 సీట్లలో బీజేపీవి 25 కాగా, ఇప్పుడు బీజేపీ ఏకగ్రీవాలతో (14) కలుపుకొని 22 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
దీంతో ఆ పార్టీకి మూడు సీట్లు తగ్గాయి. శుక్రవారం ఎన్నికలు జరిగిన 16 స్థానాల్లో రాజస్థాన్(4)లో కాంగ్రెస్-3, బీజేపీ-1, కర్ణాటక(4)లో బీజేపీ-3, కాంగ్రెస్-1, మహారాష్ట్ర(6)లో బీజేపీ-3, శివసేన-1, కాంగ్రెస్-1, ఎన్సీపీ-1, హర్యానా(2)లో బీజేపీ-1, స్వతంత్ర అభ్యర్థి-1 గెలుపొందారు. ఈ ఎన్నికల ద్వారా రాజ్యసభకు ఎన్నికైన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రణ్దీప్ సుర్జేవాలా తదితరులు ఉన్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపిస్తూ హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ను కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది.