న్యూఢిల్లీ, మే 23: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదాపడ్డ సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై జూన్ 1లోపు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి మే 25లోపు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్నాథ్తో పాటు వివిధ రాష్ర్టాల ఉన్నతాధికారులతో ఆదివారం రెండు గంటలపాటు వర్చువల్ మాధ్యమంగా జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వెల్లడించారు. పరీక్షల నిర్వహణతో పాటు విద్యార్థులు, టీచర్ల రక్షణ, భద్రత కూడా తమకు ముఖ్యమని పోఖ్రియాల్ పేర్కొన్నారు. కాగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఏప్రిల్ 14న సీబీఎస్ఈ ప్రకటించింది. అయితే 12 బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు జేఈఈ-మెయిన్స్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
పరీక్షలపై సీబీఎస్ఈ ప్రతిపాదనలు
12వ తరగతి పరీక్షలను నిర్వహించడంపైనే సీబీఎస్ఈ మొగ్గు చూపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 15-ఆగస్టు 26 మధ్య పరీక్షలను నిర్వహించడానికి, సెప్టెంబర్లో ఫలితాలు విడుదల చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు సమావేశంలో సీబీఎస్ఈ అధికారులు ప్రతిపాదన చేసినట్టు సమాచారం. పరీక్షల నిర్వహణకు బోర్డు రెండు మార్గాలను సూచించినట్టు తెలుస్తున్నది. అవి మొదటి ఆప్షన్ ప్రకారం.. 19 మేజర్ సబ్జెక్టులకు రెగ్యులర్ పరీక్షలు నిర్వహించాలి. మిగతా సబ్జెక్టుల మార్కులను.. మేజర్ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను బట్టి వేయాలి.
రెండో ఆప్షన్ ప్రకారం.. విద్యార్థి చదివిన స్కూల్లోనే రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలి. మొదటిసారి ఏ కారణం చేతనైనా విద్యార్థి పరీక్ష రాయకపోతే, రెండోసారి అవకాశం కల్పించాలి. అలాగే, పరీక్షకు ప్రస్తుతం ఉన్న మూడు గంటల సమయాన్ని 90 నిమిషాలకు కుదించాలి. ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్షను నిర్వహించాలి. వీలైతే ఆదివారాల్లో ఎగ్జామ్స్ జరిగేలా చూడటం మంచిది.
పరీక్షల నిర్వహణపై ఎవరు ఏమన్నారంటే?
సీబీఎస్ఈ పన్నెండు పరీక్షలను రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు విజ్ఞప్తులు చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాకనే పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు వ్యాక్సిన్ వేశాకనే ఎగ్జామ్స్ నిర్వహించడం మంచిదని ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు సూచించాయి. కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరుపాలని పంజాబ్ పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షల నిర్వహణే మంచిదని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.