బెంగళూరు: భార్య సహా ఐదుగురిని అత్యంత కిరాతకంగా చంపేసిన హంతకుడు తిప్పయ్యకు మరణదండన సబబేనని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. 2017లో ఫిబ్రవరి 25న బళ్లారిలోని కెంచనగూడ హళ్లి ఏరియాకు చెందిన బైలూరు తిప్పయ్య తన భార్య పక్కీరమ్మను, మరదలు గంగమ్మను, తన ముగ్గురు పిల్లలు పవిత్ర, నాగరాజు, రాజప్పలను అత్యంత కిరాతకంగా హత్యచేశాడు.
అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో తాను ఈ హత్యలకు పాల్పడినట్లు తిప్పయ్య పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా విచారణ చేపట్టింది. 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా గుర్తించి మరణశిక్షను ఖరారు చేసింది.
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 2022 నవంబర్లో విచారణ పూర్తిచేసినా తీర్పును రిజర్వ్లో పెట్టింది. కేసుకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించిన అనంతరం తిప్పయ్యకు మరణదండనే సరైనదని నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెల్లడించింది. కాగా, దేశంలో చోటుచేసుకున్న అత్యంత కిరాతకమైన నేరాల్లో ఒకటిగా ఈ కేసు రికార్డుల్లో నమోదైంది.