అహ్మదాబాద్, ఫిబ్రవరి 18: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరు చనిపోయేదాకా జైలులోనే ఉంచాలని ఆదేశిస్తూ జడ్జి ఏఆర్ పటేల్ 7వేల పేజీలతో కూడిన తీర్పును శుక్రవారం వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఒక కేసులో ఒక కోర్టు ఇంతమందికి మరణ శిక్ష విధించడం ఇదే మొదటిసారి. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో తమిళనాడులోని టాడా కోర్టు 26 మందికి మరణ శిక్ష విధించింది. పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దోషులకు కూడా జరిమానా విధించింది. ఈ పేలుళ్లు సంభవించినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ, హోం మంత్రిగా అమిత్ షా ఉన్నారు. 2008 జూలై 26న అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాదులు 21 చోట్ల బాంబులను పేల్చివేశారు. పేలుళ్లలో 56 మంది పౌరులు చనిపోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. సూరత్లోనూ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అహ్మదాబాద్లో పేలుళ్ల తర్వాత కొన్ని రోజుల్లోనే సూరత్లోనూ 29 బాంబులు దొరికాయి.
78 మందిపై అభియోగాలు
ఈ కేసులో మొత్తం 78 మందిపై అభియోగాలున్నాయి. పోలీసులు 35 ఎఫ్ఐఆర్లను(అహ్మదాబాద్లో 20, సూరత్లో 15) నమోదు చేశారు. ఒకరు అప్రూవర్గా మారారు. 2009 డిసెంబర్ నుంచి 77 మంది నిందితులపై విచారణ ప్రారంభమైంది. గతేడాది సెప్టెంబర్లో ముగిసింది. ఈ కేసు విచారణలో మొత్తం 9 మంది జడ్జిలు పాలుపంచుకొన్నారు. విచారణ ప్రారంభం అయినప్పుడు జస్టిస్ బేలా త్రివేది ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి. ప్రస్తుతం తీర్పు వెలువరించిన జడ్జి ఏఆర్ పటేల్ ఈ కేసు విచారణ బాధ్యతలను 2017 జూన్ 14న చేపట్టారు. శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులోని 77 మంది నిందితుల్లో 28 మందిని ప్రత్యేక కోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 49 మంది శుక్రవారం ఎనిమిది జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దోషులంతా ఇండియా ముజాహిదీన్(ఐఎం), సిమికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొన్నారు.