Eknath Shinde | మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కోరల నుంచి శివసేనను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నామని శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. తమ ప్రయత్నాలు, మనో భావాలను శివసేన కార్యకర్తలు తప్పనిసరిగా అర్ధం చేసుకోవాలని కోరారు. శివసేన, శరద్ పవార్ సారధ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, స్వతంత్య్ర ఎమ్మెల్యేల మద్దతుతో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సర్కార్ ఏర్పాటైంది.
ఎంవీఏ ప్రభుత్వ కోరల నుంచి శివసేనను కాపాడటానికే తాను ప్రయత్నిస్తున్నానని, అందుకోసమే పోరాడుతున్నానని, శివసేన కార్యకర్తలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని శనివారం ట్వీట్ చేశారు. తన పోరాటం శివసేన కార్యకర్తలకు మేలు చేయడానికేనని పేర్కొన్నారు.
శివసేన పార్టీ శ్రేణులు.. అధినేత- మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగా నిలిచారు. రెబెల్ నేత ఏక్నాథ్ షిండేతోపాటు ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బ్యానర్లపై వారి ఫొటోలపై సిరా పూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారి ఇండ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో అసహజ కూటమి నుంచి వైదొలిగి, బీజేపీతో పొత్తు పునరుద్ధరించాలని ఇంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేను షిండే డిమాండ్ చేశారు.