భోపాల్: చనిపోయిన వ్యక్తికి వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైనట్లుగా మెసేజ్, సర్టిఫికేట్ను అధికారులు పంపారు. దీంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్లోని రాయ్ఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బియోరా పట్టణానికి చెందిన 78 ఏళ్ల పురుషోత్తం శక్యవార్ ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలి డోసు టీకా వేయించుకున్నారు. నెల తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన ఇండోర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 24న చనిపోయారు.
కాగా, సెకండ్ డోస్ టీకా తీసుకోవాలంటూ గత నెలలో ఆయన మొబైల్ నంబర్కు మెసేజ్ వచ్చింది. తాజాగా పురుషోత్తం రెండు డోసుల టీకా తీసుకున్నట్లుగా అధికారులు ఈ నెల 3న మెసేజ్ పంపారు. దీంతో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను ఆయన కుమారుడు డౌన్లోడ్ కూడా చేశారు. తన తండ్రి మరణించి ఆరు నెలలైందని, ఆయన టీకా రెండు డోసులు తీసుకున్నట్లుగా అధికారులు ధృవీకరణ సందేశాన్ని పంపారని మీడియాకు తెలిపారు. దీంతో అధికారుల తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా, కంప్యూటర్ డేటా ఎంట్రీలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ పీఎల్ భగోరియా తెలిపారు. ఆయన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఉంటారని చెప్పారు. పొరపాటును సరిచేసినట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తప్పుడు లెక్కలతో వ్యాక్సినేషన్ శాతం ఎక్కువ సాధించినట్లుగా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పులు పోతున్నదని విమర్శించింది.