న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సముహాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించారు. మాస్కు ధరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరిందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన డాటాలో తప్పుగా నమోదైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన డాటాలో పేర్కొన్నట్లుగా ఢిల్లీలో నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 57 కాదని, 54 మాత్రమేనని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ క్లారిటీ ఇచ్చారు. ఆ 54 మందిలో కూడా ఇప్పటికే 18 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని జైన్ వెల్లడించారు.