న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ హయాంలో ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగీ ఆదిత్యానాథ్ చేసిన అభివృద్ధి పనులకు దేశమంతా సాక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. పాత ప్రభుత్వాలు అభివృద్ధిని గాలికి వదిలేశాయని ఆరోపించారు. అందుకే యూపీలో పాత ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి రానివ్వగూడదని ఇక్కడి ఆడబిడ్డలు ఇప్పటికే నిర్ణయించారని ప్రధాని పేర్కొన్నారు.
ఇవాళ ప్రయాగ్రాజ్లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్కీమ్ కింద అర్హులైన వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పథకం కింద ఇవాళ నాకు లక్ష మంది లబ్దిదారులైన ఆడబిడ్డల ఖాతాల్లోకి కోట్ల రూపాయల నగదు బదిలీచేసే అవకాశం దక్కింది. యూపీలోని ఆడబిడ్డలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరం. గత ప్రభుత్వాల హయాంలో ఈ ఆడబిడ్డలకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేవు. ఇప్పుడు వాళ్లు బ్యాంకుల్లో డిజిటల్ సేవలు పొందుతున్నారు. అందుకే యూపీలో ఏ అభివృద్ధి చేయని గత ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి రానీయగూడదని ఇక్కడి ఆడబిడ్డలు నిర్ణయించారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.