ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబై మహీం బీచ్లో దర్గా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించడంతో గురువారం బీఎంసీ అధికారులు దర్గాను కూల్చివేశారు. ఆక్రమిత భూమిలో అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.
మహీం తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన దర్గాను బీఎంసీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కూల్చివేశారు. కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు శిధిలాలను ట్రక్కుల్లో తరలించారు. కాగా రాజ్ ఠాక్రే గుడిపడ్వా సందర్భంగా మాట్లాడుతూ ముంబైలోని మహీం తీరంలో అక్రమంగా దర్గా నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ ఓ వీడియోను ప్రదర్శించారు.
ఇది ఎవరి దర్గా అని ఆయన ప్రశ్నిస్తూ రెండేండ్ల కిందట ఈ దర్గా లేదని, అక్రమ నిర్మాణాన్ని తక్షణమే తొలగించని పక్షంలో అదే స్ధలంలో తాము భారీ గణపతి ఆలయాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. దర్గా డ్రోన్ ఫుటేజ్ను ఎంఎన్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మహీం బీచ్లో ఈ అక్రమ నిర్మాణం జరిగిందని రాజ్ ఠాక్రే దుయ్యబట్టారు.