లక్నో : బీజేపీ ప్రభుత్వంలో దళితులు, ఓబీసీలు, బ్రాహ్మణులు దోపిడీకి గురయ్యారని కాంగ్రెస్ నాయకులురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. యూపీ సీఎం కంచుకోట అయిన గోరఖ్పూర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో చేనేత కార్మికులు, ఓబీసీలు, పేదలు, మైనారిటీలు, బ్రాహ్మణులు దోపిడీకి గురయ్యారని ఆరోపించారు. గురు గోరఖ్నాథ్ బోధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రభుత్వం ప్రజలపై దాడులు చేస్తోందని విమర్శించారు.
గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక గోరఖ్పూర్ను మరిచిపోయారన్నారు. ఆరోగ్య సేవలు అధ్వాన్నంగా మారాయని, కరోనా సమయంలో శవాలు నదిలో తేలుతూ కనిపించాయన్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం తన చేయాల్సిన పనులను జాబితా చేసుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో ఎరువుల కొరతపై ప్రియాంక విమర్శనాస్త్రాలు సంధించారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసిందో? క్షేత్రస్థాయిలో ఎవరు పోరాడుతున్నారో బీజేపీ వెంట ఉన్నవారే చెప్పాలన్నారు.
కాంగ్రెస్ 70 సంవత్సరాల కష్టాన్ని బీజేపీ ఏడేళ్లలో తుడిచిపెట్టిందని ప్రియాంక మండిపడ్డారు. 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ రైల్వేలు, రోడ్లు, ఎయిర్పోర్టులను నిర్మిస్తే.. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం అన్నీ అమ్ముతోందని ఆరోపించారు. ఇవాళ యువకులు ఎంతో మంది నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో 5కోట్ల మంది నిరుద్యోగ యువకులున్నారన్నారు. ప్రతి రోజూ ముగ్గురు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఉందని.. బీజేపీ ప్రభుత్వంలో పేదలకు ఉద్యోగం లేదన్నారు. ప్రస్తుత పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయని.. నా సోదరీమణుల కోసం తాను పోరాడుతానని.. పోరాడే శక్తిని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీకి ప్రాణహాని ఉందని ముందే తెలుసునని.. అయినా ఆమె దేశం విడిచి వెళ్లలేదన్నారు. ‘ఆమె (ఇందిర) హత్యకు గురికావచ్చని తెలుసు.. కానీ ఎప్పుడూ తలవంచలేదు.. ఎందుకంటే ఆమె పట్ల మీ విశ్వాసం కంటే గొప్పది మరొకటి లేదు’ అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని తాను (ప్రియాంక) మీ ముందుకు వచ్చానని.. మీ నమ్మకాన్ని వమ్ము చేయను’ అని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే రూ.32వేలకోట్లతో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చేపల పెంపకానికి వ్యవసాయ హోదా, వరి.. గోధుమలకు రూ.2500, యువతకు 20లక్షల ప్రభుత్వ, ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఎలాంటి వ్యాధి బారినపడ్డా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు.