Caste discrimination | తమిళనాడులోని ఓ గ్రామంలో కులవివక్ష రెండు వర్గాల మధ్య చీలికకు, గ్రామంలో ఉద్రిక్తతలకు కారణమైంది. విల్లుప్పురం జిల్లాలోని కొలియనర్ గ్రామంలో 300 ఏండ్ల పురాతన ద్రౌపతి అమ్మన్ ఆలయం ఉంది. ఆలయంలోకి దళితులు ప్రవేశించవద్దంటూ ఇతర వర్గాల వారు ఆంక్షలు విధించారు. అయితే, ఇటీవల ఆలయంలో జరిగిన పండుగ సందర్భంగా కొందరు దళితులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా ఇతర వర్గాల వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణలు జరిగాయి. దళితులను అడ్డుకున్న వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
దళితులు మంత్రి కే పొన్ముడిని కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దళితులను అడ్డుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇతర వర్గాల ప్రజలు ఆలయం ముందు ఆందోళన చేపట్టారు. వీరిని శాంతింపజేసేందుకు ఓ అధికారి ప్రయత్నించగా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.