జైపూర్: దళిత యువతి (Dalit woman)ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంటికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పడేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులుగా తేలింది. దీంతో వారిని సస్పెండ్ చేశారు. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి ప్రతి రోజూ ఉదయం వేళ కంప్యూటర్ శిక్షణ కోసం ఖజువాలాకు వెళ్తున్నది. దినేష్ విష్ణోయ్ అనే వ్యక్తి 15 రోజులుగా ఆమెను అనుసరించి వేధించాడు. మంగళవారం ఉదయం కంప్యూటర్ కోచింగ్ సెంటర్కు చేరిన ఆ యువతిని పోలీస్ కానిస్టేబుళ్లు భగీరథ్ విష్ణోయ్, మనోజ్ విష్ణోయ్, మరో ఇద్దరితో కలిసి దినేష్ కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దినేష్ ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ యువతిని హత్య చేశారు. ఖజువాలాలోని ఒక సినిమా థియేటర్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు.
కాగా, కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. దళిత యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులు నిందితులని పోలీస్ అధికారి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ నేరంలో పాల్గొన్న పోలీస్ కానిస్టేబుల్స్ భగీరథ్ విష్ణోయ్, మనోజ్ విష్ణోయ్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.