లక్నో, సెప్టెంబర్ 26: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పరీక్షలో స్పెల్లింగ్ తప్పు రాశాడనే నెపంతో దళిత విద్యార్థిని అగ్రకుల ఉపాధ్యాయుడు రాడ్డుతో విచక్షణారహితంగా చావబాదాడు. అపస్మారకస్థితికి వెళ్లిన బాలుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఔరైయా జిల్లాకు చెందిన దళిత విద్యార్థి నిఖిత్ దొహ్రే (15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 7న ఉపాధ్యాయుడు అశ్వినీసింగ్ సాంఘికశాస్త్రంపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించాడు. విద్యార్థి నిఖిత్ జవాబులో స్పెల్లింగ్ తప్పుగా రాశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు విద్యార్థి నిఖిత్ను రాడ్లు, కర్రలతో కొట్టాడు. పలుమార్లు తన్నాడు. కులం పేరుతో దూషించాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన విద్యార్థి నిఖిత్ను దవాఖానకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థి శనివారం రాత్రి మరణించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.