Karnataka | బెంగళూరు : దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు మరో టీచర్ను అరెస్టు చేశారు. నలుగురు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే.. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయి గురుకుల పాఠశాలలో 243 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇటీవలే ఓ నలుగురు విద్యార్థుల చేత పాఠశాల ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ను క్లీన్ చేయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అయితే సెప్టిక్ ట్యాంక్లను పిల్లల చేత శుభ్రం చేయించడం నిషేధంగా ఉంది. గత మూడు దశాబ్దాల నుంచి ఈ నిషేధం కొనసాగుతోంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఈ పనులు చేయడం వల్ల ఊపిరాడక ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ శిక్ష కింద గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నలుగురు విద్యార్థులు చేత సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించారు.
ఇదే స్కూల్కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత మంది విద్యార్థుల వీపులపై బరువైన బ్యాగులు ఉంచి, చేతులను పైకి ఎత్తమని చెప్పి, శిక్షించినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ రెండు ఘటనలపై కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది.
స్కూల్ ప్రిన్సిపాల్ భరతమ్మ, టీచర్ మునియప్పను అరెస్టు చేయగా, నలుగురు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఈ ఘటనపై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది.