భోపాల్ : దళితులు పెళ్లి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించి, వరుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని గూండాలు హెచ్చరించారు. ఈ క్రమంలో దళిత కులానికి చెందిన ఓ పెళ్లి కుమారుడి ఊరేగింపు 100 మంది పోలీసుల పహారాలో జరిగింది.
మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా సర్సి గ్రామానికి చెందిన రాహుల్ మేఘ్వాల్ జనవరి 27న పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లిని ఘనంగా నిర్వహించొద్దని, గుర్రపు స్వారీ చేయొద్దని గూండాలు ఆదేశించారు. ఒకవేళ నిర్వహిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో రాహుల్, ఆయన తండ్రి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి వివాహానికి రక్షణ కల్పించాలని రాహుల్ తండ్రి ఫకీర్చంద్ మేఘ్వాల్ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో కలెక్టర్ స్పందించి.. రాహుల్ పెళ్లికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
ఇక మూడు పోలీసు స్టేషన్ల పోలీసులు రాహుల్ పెళ్లికి రక్షణ కల్పించారు. డీజే సౌండ్లు, డ్యాన్సుల మధ్య గుర్రంపై వరుడిని ఊరేగించారు. ఈ పెళ్లికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు తహసీల్దార్, ఎస్డీవోపీ, ఎస్డీఎం హాజరయ్యారు. గ్రామస్తులు కూడా చాలా వరకు సహకరించారు. ఇక పెళ్లి కుమారుడు రాహుల్ గుర్రంపై వెళ్తున్న సమయంలో తన చేతిలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఉంచి ప్రదర్శించారు.