Anti-Drone System | న్యూఢిల్లీ, మార్చి 23 : మన వైమానిక రక్షణ దళంలో కొత్త సాంకేతికత చేరింది. రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన డీ4తో మన వైమానిక దళం మరింత పటిష్టంగా మారనుంది. నేటి ఆధునిక యుగంలో డ్రోన్లు యుద్ధ రంగంలో కీలకంగా మారాయి. జమ్మూ ఎయిర్ఫోర్స్ స్టేషన్పై 2021లో జరిగిన డ్రోన్ దాడినే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే భవిష్యత్తులో భారత్కు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సమర్థంగా డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకే మన వైమానిక దళం యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలో తయారైన డీ4ను దేశ సరిహద్దుల్లోని ప్రధాన ప్రాంతాల్లో మోహరిస్తారు.
డ్రోన్ గుర్తింపు, అడ్డగింత, నాశనం ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న డీ4 ఇప్పటివరకు మన సరిహద్దుల వద్ద ఉన్న బలహీన పరిస్థితులను అధిగమిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు బహుళస్థాయిలుగా ఉంటుంది. వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణతో దీనిని రూపొందించారు. ముఖ్యంగా ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్, కృత్రిమ మేధ ఆధారిత ముప్పు వర్గీకరణ, ఎలక్ట్రానిక్ జామింగ్, యుక్తి ప్రదర్శన, హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్ న్యూట్రలైజేషన్ వంటి సాంకేతికతలను పొందుపరిచారు.