చెన్నై: మిచాంగ్ తుఫాను మరింత తీవ్రమైంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. దాంతో భారత వాతావరణ కేంద్రం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీచేసింది. మత్స్యకారులు చేపల వేటకు పోకూడదని, జనం సముద్ర తీరం వైపు వెళ్లవద్దని హెచ్చరించింది.
కాగా, తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు నదుల్లా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దాంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.