బెంగళూరుకు చెందిన రమేశ్ ఫోన్కు తన వాహనానికి చలాన్ విధించినట్టు సందేశం వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేయగా.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్ నుంచి లక్షల్లో నగదు కట్ అయినట్టు ఆయనకు సందేశాలు వచ్చాయి. పోలీసులను ఆశ్రయించగా.. సైబర్ క్రైమ్ బారిన పడినట్టు వారు గుర్తించారు. దీంతో రమేశ్ లబోదిబోమన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు వారి ఆటకట్టిస్తుండటంతో సైబర్ నేరస్థులు సైతం కొత్త దారులను వెతక్కుంటున్నారు. తాజాగా ఈ-చలానాల పేరిట జరుగుతున్న స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఈ-చలాన్లకు సంబంధించి పోలీసులు పంపించే తరహాలోనే సైబర్ నేరస్థులు సైతం ఫోన్లకు సందేశాలు పంపించి నగదు తస్కరిస్తున్నారు. కాగా, పోలీసులు పంపించే లింకు https://echallan. parivahan.gov.in అని ఉంటుంది. దీన్ని కాపీ కొట్టిన సైబర్ నేరస్థులు https://echallan.parivahan.in అని లింకు పంపిస్తున్నారు. ప్రభుత్వ చలాన్ల చెల్లింపు లింకులో gov అని ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఫోన్ నంబర్లతో చలాన్ల సందేశాలు రావని చెబుతున్నారు. ఫేక్ చలాన్ల సందేశాలు వస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నంబర్-1930కి ఫిర్యాదు చేయాలని పేర్కొంటున్నారు. www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.