న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2026) నిర్వహణలో ఆలస్యం జరిగింది. శనివారం రెండో షిఫ్ట్లో జరుగాల్సినపరీక్షపై ఎక్కువ ప్రభావం చూపింది. మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షను సాయంత్రం 4:00 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. దీంతో విద్యార్థులు తమకు కేటాయించిన రిపోర్టింగ్ సమయం దాటిన తర్వాత కూడా పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది.
కాగా, సీయూఈటీ యూజీ 2026 నిర్వహణలో ఆలస్యానికి సాంకేతిక సమస్య కారణమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తమకు ప్రధానంగా సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నివేదించిన సాంకేతిక లోపం కారణంగా పరీక్ష నిర్వహణలో ఆలస్యం జరిగినట్లు ఎన్టీఏ వివరించింది. అయితే సమస్యను త్వరగా పరిష్కరించినట్లు పేర్కొంది. ఈ జాప్యం కారణంగా ఏ అభ్యర్థికీ నష్టం జరగకుండా ఉండేందుకు పూర్తి సమయం పాటు పరీక్షను కొనసాగిస్తామని వెల్లడించింది.
మరోవైపు సాంకేతిక సమస్య కారణంగా ఉదయం షిఫ్ట్ అభ్యర్థులకు కూడా పరీక్ష కోసం పూర్తి సమయం కేటాయించినట్లు ఎన్టీఏ తెలిపింది. పరీక్ష పూర్తి చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులను వెళ్ళడానికి అనుమతిస్తారని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యం పట్ల ఎన్టీఏ విచారం వ్యక్తం చేసింది.

NTA