కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ నేత మమతా బెనర్జీ(Mamata Banerjee) .. భబానిపుర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇవాళ ఆమె కేంద్ర భద్రతా బలగాలు, పోల్ అబ్జర్వర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. భబానిపుర్లో పోలింగ్ బూత్లను సందర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి నుంచే రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నదని, టీఎంసీ కార్యకర్తలను అధికారులు బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో తమ పార్టీకి చెందిన పోస్టర్లను తొలగించినట్లు ఆమె చెప్పారు.
సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు, ఇతర పోల్ అబ్జర్వర్లు.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని విమర్శించారు. ఎటువంటి కారణం లేకుండానే వివిధ ప్రాంతాల్లో పార్టీ వర్కర్లను తీసుకెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను డిస్టర్బ్ చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సాధారణ అభ్యర్థిగా పోలింగ్ స్టేషన్లను విజిట్ చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తనతో పాటు అభిషేక్ బెనర్జీ కూడా రాత్రంతా మెళకువతో ఉన్నట్లు తెలిపారు. అసిమ్ బాసు అనే టీఎంసీ ప్రతినిధిని వేధించినట్లు ఆమె పేర్కొన్నారు.
సెకండ్ ఫేస్లో 142 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనున్నది. సుమారు 3.22 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. రెండో ఫేస్లో 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవాళ ఉదయం 9 గంటల వరకు 18.39 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.