RVM | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం (ఈసీ) రానున్న లోక్సభ ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఆర్వీఎం) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. దీనిపై చర్చించేందుకు గత జనవరి 16న దేశంలోని ఎనిమిది జాతీయ, 57 రాష్ట్రీయ రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానించింది. అయితే, ఎన్నికల్లో ఆర్వీఎంలను తీసుకురావడాన్ని మెజార్టీ విపక్షాలు వ్యతిరేకించాయి. రిమోట్ ఓటింగ్కు సంబంధించి తమ అనుమానాలకు ఈసీ జవాబివ్వాలని విజ్ఞప్తి చేశాయి.
దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు తాము ఎక్కడుంటే అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాయపడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రమే ఆర్వీఎం. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కుని వినియోగించుకునేలా ఈసీ ఆర్వీఎం ప్రొటోటైప్ను ఇప్పటికే అభివృద్ధి చేసింది.
2019 లోక్సభ ఎన్నికల్లో 67.4 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, దాదాపు 30 కోట్ల మంది ఓటింగ్కు దూరమయ్యారని ఈసీ తెలిపింది. సొంత నియోజకవర్గంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లు ఉండటమే దీనికి కారణంగా పేర్కొంది. దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో రిమోట్ లొకేషన్ నుంచే పోలింగ్లో పాల్గొనేందుకు ఈ యంత్రాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.
రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంటే పెద్ద ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రజాప్రాతినిథ్య చట్టం-1950, 1951, ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961, ఓటర్ల నమోదు నిబంధనలు-1960 చట్టాల్లో మార్పు చేయాల్సి ఉంటుంది.
రిమోట్ ఓటింగ్ వ్యవస్థను తొలిసారిగా ఎస్తోనియా 2005లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ కూడా రిమోట్ ఓటింగ్ను అమల్లోకి తీసుకొచ్చాయి. అయితే గోప్యత, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం, పౌరులు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో రిమోట్ ఓటింగ్నుఉపసంహరించుకొన్నాయి.