న్యూఢిల్లీ, మే 6: అంతకుమునుపటి ఏడాదితో పోల్చితే 2024లో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలు భారీగా పెరిగాయని ‘ఎన్సీఆర్బీ’ (జాతీయ నేర గణాంకాల బ్యూరో) తాజాగా వెల్లడించింది. 2024లో పిల్లలపై నేరాలు 5.9 శాతం మేర పెరిగాయని, ఇందులో 75,108 కిడ్నాప్లు ఉన్నాయని తెలిపింది. పిల్లలపై జరిగిన లైంగిక నేరాల్లో 69,191 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయని ‘ఎన్సీఆర్బీ’ పేర్కొన్నది. తాజా గణాంకాల ప్రకారం, మహిళలపై నేరాలకు సంబంధించి దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక్క 2024 ఏడాదిలో 13,396 కేసులు నమోదైనట్టు నివేదిక తెలిపింది.
కాగా, దేశవ్యాప్తంగా క్రైం రేట్ 6 శాతం తగ్గిందని పేర్కొన్న నివేదిక, దేశంలో 2024లో 27,049 హత్యలు జరిగినట్టు పేర్కొన్నది. మొత్తం 96,079 మంది కిడ్నాప్కు గురికాగా, ఇందులో 70,000కుపైగా బాధితులు మహిళలే ఉన్నారు. సైబర్నేరాలు అత్యధికంగా చోటుచేసుకున్న నగరంగా బెంగళూర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ 2024లో 17,561 సైబర్ నేరాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1.01,928 కేసులు నమోదైనట్టు నివేదిక పేర్కొన్నది. మహిళలపై నేరాల రేటు విషయంలో దేశం మొత్తం మీద జైపూర్, ఇండోర్, లక్నో మొదటి మూడు స్థానాల్లో నిలువగా, ఢిల్లీ నాలుగో స్థానంలో ఉంది. 2024 ఏడాదికి సంబంధించి ఢిల్లీలో నేరాల రేటు 176.8గా నివేదిక పేర్కొన్నది.