Crime news : మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మూడు హత్యలు చేసి నిందితుడు మృతదేహాల పక్కనే పడుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగ్భూమ్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో గురుచరణ్ పాడియా అనే వ్యక్తి భార్య.. ఐదేళ్లు, ఏడాది వయస్సున్న ఇద్దరు బిడ్డలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తప్పతాగి వచ్చి భార్య జానోతో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.
వచ్చీ రావడంతోనే భార్యతో గొడవకు దిగాడు. తాగి వచ్చి గోల చేస్తున్నావంటూ భార్య కూడా ఎదురు తిరగడంతో గొడవ మరింత పెద్దదైంది. దాంతో మద్యం మత్తులో ఉన్న గురుచరణ్ ఇంట్లోని గొడ్డలితో భార్యను నరికేశాడు. గొడవ కారణంగా నిద్రలేచిన పెద్ద బిడ్డ.. తండ్రి తన కళ్లముందే తల్లిని నరికేయడంతో భయంతో గడగడలాడుతూ ఏడవడం మొదలుపెట్టింది. దాంతో గురుచరణ్ అదే గొడ్డలితో బిడ్డను కూడా నరికేశాడు. ఆపై మరో గదిలో నిద్రలో ఉన్న ఏడాది బిడ్డను కూడా నరికి చంపాడు.
మూడు హత్యలు చేసిన అనంతరం హాయిగా మృతదేహాల పక్కనే నిద్రపోయాడు. అయితే అప్పటిదాకా గొడవ జరిగిన ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్ధం చోటుచేసుకోవడంతో ఏదో జరిగిందని అనుమానించిన ఇరుగుపొరుగు లోపలికి వెళ్లి చూడగా హృదయవిదారక దృశ్యం కంటపడింది. భార్య, ఇద్దరు బిడ్డలు రక్తపు మడుగులో పడివుండగా గురుచరణ్ హాయిగా నిద్రపోతూ కనిపించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. నిందితుడు గురుచరణ్ను అరెస్ట్ చేశారు. బుధవారం గురుచరణ్ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.