న్యూఢిల్లీ, మార్చి 12 : ఓబీసీల రిజర్వేషన్లకు క్రీమీలేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించ లేమని, ప్రైవేట్ సంస్థలు, పీఎస్యూల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కంటే భిన్నంగా పరిగణించడం, రిజర్వేషన్లను నిర్ణయించడం విద్వేషపూరిత వివక్షకు సమానమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
సివిల్ సర్వీస్ పరీక్షలకు ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) ప్రయోజనాన్ని పొందే అభ్యర్థుల అర్హతకు సంబంధించి ఢిల్లీ, మద్రాస్, కేరళ హైకోర్టుల నిర్ణయాలను జస్టిస్లు పీఎస్ నరసింహ, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సమర్థించింది. దీనిని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కులం చారిత్రక ప్రతికూలతకు సూచికగా ఉన్నప్పటికీ, వెనుకబాటుతనానికి ఏకైక నిర్ణయాధికారిగా పరిగణించ లేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.