చండీగఢ్: పంట వ్యర్థాల దహనం (Stubble Burning) పై హర్యానా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. పంట వ్యర్థాలను తగులబెట్టిన వారికి చలాన్లు జారీ చేస్తున్నది. ఉల్లంఘించిన వారి నుంచి రూ.25 లక్షలకుపైగా జరిమానా వసూలు చేసింది. హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం గాలి కాలుష్యానికి దారి తీస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. 2022లో 2,083 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఈ కేసులు గణనీయంగా తగ్గాయని, 1,296 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2021 కంటే 2023లో కేసుల సంఖ్య 57 శాతం మేర తగ్గినట్లు చెప్పారు. పంట వ్యర్థాల దహనానికి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 939 చలాన్లు జారి చేయడంతోపాటు రూ.25.12 లక్షల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు.
కాగా, పంజాబ్, హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడంతో ఆ రెండు రాష్ట్రాల్లో గాలి కాలుష్యానికి దారి తీస్తున్నది. అలాగే పొరుగున్న ఉన్న రాజధాని ఢిల్లీపై ప్రభావం చూపుతున్నది. అక్కడి గాలి కలుషితం కావడంతోపాటు పొగ మంచు వల్ల గాలి నాణ్యత తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో విషపూరిత గాలిని పీల్చలేక ఢిల్లీ ప్రజలు అల్లాడుతున్నారు.