Cracker Ban | ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది సైతం దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది. శీతాకాలం నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు దీపావళి నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై ఆంక్షలు తీసుకువచ్చింది. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలు, తయారీపై నిషేధం విధించడం వరుసగా ఇది మూడోసారి. బాణాసంచ తయారీ, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పటాకుల అమ్మకాలను నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలకు సైతం విజ్ఞప్తి చేసింది.
చలికాలం కాలుష్యాన్ని అరికట్టే కార్యాచరణలో భాగంగా బాణాసంచా తయారీ, అమ్మకం, నిల్వ, వాడకాన్ని నిషేధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. పటాకులను నిషేధించాలని పొరుగు రాష్ట్రాలకు సైతం విజ్ఞప్తి చేసినట్లు చెప్పింది. పటాకులకు సంబంధించి ఎవరికీ లైసెన్సులు ఇవ్వకూడదని అధికారులకు సూచించింది. గతేడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో పటాకులు నిషేధించిన విషయం తెలిసిందే. చలికాలంలో ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, సుప్రీంకోర్టు, ఎన్జీటీ సూచనల నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు, ఆప్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ మండిపడ్డారు.