ఇంఫాల్, ఫిబ్రవరి 13: కుకీ, మైతీ తెగల మధ్య అలర్లతో అతలాకుతలమైన మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 1961 తర్వాత రాష్ర్టానికి వచ్చి స్థిరపడిన అక్రమ వలసదారులను గుర్తించి, రాష్ట్రం నుంచి పంపేస్తామని ఆయన ప్రకటించారు. పొరుగుదేశం మయన్మార్ మిలటరీ చేతుల్లోకి వెళ్లాక చాలామంది ప్రాణాలు అరచేత పట్టుకుని పక్కనే ఉన్న మణిపూర్కు క్యూకడుతున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకల విధానం వీరికి అనువుగా మారింది. అయితే, ఇది మణిపూర్లో కొత్త తలనొప్పులు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ‘ప్రాజెక్టు బునియాద్’ కార్యక్రమంలో సీఎం బీరేన్సింగ్ మాట్లాడుతూ 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి కులం, సామాజికవర్గంతో సంబంధం లేకుండా వెనక్కి పంపించేస్తామని పేర్కొన్నారు.
1961ని బేస్ ఇయర్గా తీసుకుని ఆ తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపాలన్న ప్రతిపాదనకు మణిపూర్ క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇందులో ఓ చిక్కుంది. స్థానికేతరులను గుర్తించి వెనక్కి పంపేందుకు ప్రభుత్వం సిద్ధపడినా ఆయా దేశాలు వారిని తమ పౌరులుగా గుర్తించాల్సి ఉంటుంది. అవి వారిని తమ పౌరులుగా అంగీకరించకుంటే వెనక్కి పంపడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకుడు ప్రదీప్ పంజౌబమ్ తెలిపారు. ఫిబ్రవరి 2021లో మయన్మార్లోని అంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని మిలటరీ హస్తగతం చేసుకున్నాక రాష్ట్రంలోకి 2,187 మంది వలస వచ్చినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు గతేడాది వెల్లడించారు. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా-మయన్మార్ మధ్య ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకలకు కళ్లెం వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది.