న్యూఢిల్లీ: కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్పై, సీపీఐ పార్లమెంటు సభ్యుడు బినోయ్ విశ్వం ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. పెగాసస్ వినియోగంపై తన ప్రకటనలతో సభను ఆయన తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ‘స్పైవేర్ కొనుగోలుకు సంబంధించి నిజాన్ని దాచడానికి కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించినప్పటికీ, అనేక సాక్ష్యాలు దీనిని బహిర్గతం చేశాయి. ఈ జాబితాలో న్యూయార్క్ టైమ్స్ నివేదిక తాజాది’ అని పేర్కొన్నారు. పెగాసస్ స్నూపింగ్పై వచ్చిన తీవ్ర ఆరోపణలు, రాజ్యాంగ హక్కులు, భద్రతా ఉల్లంఘన కిందకు వస్తాయని అన్నారు. ఈ అంశంపై పార్లమెంటు సభ్యులను తప్పుదారి పట్టించేందుకు మంత్రి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడం ప్రత్యేక హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని ఆయన కోరారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ వివాదంపై లోక్సభలో వివరణ ఇచ్చారు. ‘అత్యంత సంచలనాత్మక కథనం. అనేక పెద్ద ఆరోపణలు చేశారు. కానీ వాటి వెనుక ఎటువంటి ఆధారాలు లేవు’ అని అన్నారు. అయితే 2017లో ఇజ్రాయెల్తో జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్ను భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి దీనిపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆదివారం ఒక లేఖ రాశారు. “పెగాసస్ సమస్యపై ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టించినందుకు” కేంద్ర మంత్రి వైష్ణవ్పై ప్రివిలేజ్ మోషన్ను ఆయన కోరారు. తాజాగా సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కూడా జత కలిశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్పై ప్రివిలేజ్ మోహన్ దాఖలు చేశారు.