హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుల విధానానికి సీపీఐ పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా చట్టాలను కఠినతరం చేయాలని చెప్పారు. హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో సోమవారం కూనంనేని మీడియాతో మాట్లాడుతూ..లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పోటీ చేయడం, మద్దతివ్వడం వంటి అంశాలపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి అప్పగించామని చెప్పారు. కాళేశ్వరం, కృష్ణాబేసిన్ పరిధిలో పంటలు దెబ్బతినేందుకు కారణమెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో పూర్తిస్థాయి కరువు ఉన్నదని, ఈ కాలంలో రూ.6 వేల కోట్ల వరకు పంట నష్టం జరిగిందని, 2017లో వరదలు, అధిక వర్షాలతో 12 లక్షల వానకాలం పంట, 5 లక్షల ఎకరాల యాసంగి పంట నష్టం జరిగిందని వివరించారు. 2023లో 12 లక్షల వానకాలం, 5 లక్షల యాసంగి పంటకు నష్టం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని పంటలకు 10 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరాకూ రూ.10వేల చొప్పన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.