ముంబై/పుణె/రాంచీ, సెప్టెంబర్ 13: పశువుల్లో లంపీ చర్మ వ్యాధి భారీగా విజృంభిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే ఈ వ్యాధితో దేశవ్యాప్తంగా 67 వేలకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో వెలుగు చూసిన ఈ వ్యాధి.. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ బయటపడింది. ఈ వ్యాధి వల్ల మహారాష్ట్రలో 43 పశువులు మరణించాయి. అత్యధికంగా జల్గాన్లో 17 పశువులు మృత్యువాతపడ్డాయి. అహ్మద్నగర్ 13, పుణె, బుల్దాన్, అమ్రావతిల్లో 3 చొప్పున మరణించాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం ఉన్నది.
అప్రమత్తమైన అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి ఈ వ్యాధి ప్రభావం పాల ఉత్పత్తిపై పడలేదు. మాంసం వినియోగపైనా లేదు. కాకపోతే అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే పశువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. అలాగే పశవుల అక్రమ రవాణాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు జార్ఖండ్లోని మూడు జిల్లాల్లో పశువుల్లో లంపీ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అలర్ట్గా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ వ్యాధి వల్ల ఇప్పటివరకు పశువులు మరణించలేదని అధికారులు చెప్పారు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
లంపీస్కిన్ వ్యాధి తెలంగాణలో తక్కువే పశుసంవర్ధక శాఖ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పశువులకు లంపీస్కిన్ వ్యాధి ప్రబలుతున్నది. 11 జిల్లాల్లోని 134 పశువుల్లో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో నాలుగు కేసులను లంపీస్కిన్గా గుర్తించగా, మరో 122 శాంపిళ్లను బెంగళూరులోని ల్యాబ్కు పంపించారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే మన రాష్ట్రంలో వ్యాధి తీవ్రత చాలా తక్కువ అని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్ తెలిపారు. లంపీస్కిన్తో రాష్ట్రంలో ఒక్క పశువు కూడా మరణించలేదని, పశువులపై దద్దులు కనిపిస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్ను సంప్రదించాలని సూచించారు.