న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రేపు (గురువారం) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హర్ ఘర్ దస్తక్ ప్రచార కార్యక్రమంపై చర్చించనున్నారు. దేశంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం కోసం కేంద్ర సర్కారు హర్ ఘర్ దస్తక్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకాలు వేయనున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై ఏడాది కావస్తున్నా ఇంకా తొలి డోస్ కూడా తీసుకోని వారున్నారు. తొలి డోస్ తీసుకుని రెండో తీసుకోని వారు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో హర్ ఘర్ దస్తక్ ప్రోగ్రామ్లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తొలి డోస్, రెండో డోస్ తీసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.