న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. తాజాగా 24 గంటల వ్యవధిలోనే 1,68,063 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,58,75,790కు చేరింది. క్రియాశీలక కేసులు 8 లక్షలు దాటాయి. దేశంలో ప్రస్తుతం 8,21,446 మంది కొవిడ్తో బాధపడుతున్నారు. తాజాగా కరోనాతో 227 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,84,213కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64గా నమోదైంది. రికవరీ రేటు 96.36 శాతానికి తగ్గింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 4,461కి చేరాయి. దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సీఎంలతో చర్చించనున్నారు.
లతా మంగేష్కర్, గడ్కరీకి కరోనా
ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖాన ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా వైరస్ సోకింది. ప్రముఖ నటీమణులు కీర్తి సురేశ్, రేణూ దేశాయ్, ఆమె కుమారుడు అకీరానందన్, నేహా పెండ్సే, పూజా గోర్, హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
మోల్నుపిరావిర్ యువతకు ఇవ్వొద్దు: అరోరా
కొవిడ్ చికిత్సకు వినియోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్ను యువతీ, యువకులకు ఇవ్వొద్దని ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోరా సూచించారు. ఈ డ్రగ్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ ఔషధం మానవ శరీరంలో మ్యుటేషన్లకు కారణం అవుతుందని వివరించారు. మంగళవారం జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ఔషధం అహేతుక వినియోగం ప్రమాదకరమని, ఇన్ఫెక్షన్ ప్రాథమిక స్థాయిలో ఇచ్చినప్పుడు మాత్రమే ఈ డ్రగ్ వలన ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.