BF.7 Variant | దేశంలో కరోనా కొత్త వేరియంట్ను గుర్తించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్ బీఎఫ్-7ను గుర్తించగా.. వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జన సమూహంలోకి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, వృద్ధులైతే అత్యవసర సమయాల్లోనే తప్పా బయటకు వెళ్లొద్దని చెప్పారు.
సీఐఐ పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్, ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. కొత్త వేరియంట్లు మార్పులతో వస్తాయని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ఇంతకు ముందు టీకాలు లేవని, కానీ.. ప్రస్తుతం ప్రజలంతా టీకాలు తీసుకున్నారన్నారు. దీంతో రోగనిరోధకశక్తి పెరిగిందన్నారు. అయితే, బయటకు వెళ్లే సమయంలో.. రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.
వృద్ధులు సహా వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువ ఉన్న వ్యక్తులు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోడమే ఉత్తమమని చెప్పారు. అయితే, ఆసుపత్రులు, ఐసీయూల్లో చేరే అవకాశాలు మాత్రం తక్కువన్నారు. మేదాంత హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేశ్ ట్రెహాన్ మాట్లాడుతూ కరోనా వైరస్ అనేక మార్పులకు లోనవుతుందని చెప్పారు. ఇంతకు ముందు ఒమిక్రాన్ విషయంలో చూసినంత పరిస్థితి లేదని, వైరస్ కొంత వరకు బలహీనపడిందని చెప్పారు. కొత్త వేరియంట్లు ప్రభావం చూపడంతో పాటు వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయన్నారు.