డెహ్రాడూన్: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ అడగబోమని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు తెలిపారు. అయితే చార్ ధామ్ యాత్ర కోసం విధిగా పర్యాటక శాఖ వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర సరిహద్దులో రద్దీని నివారించడంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
కాగా, మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరుస్తారు. మే 6న కేదార్నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో సంబంధిత ఆంక్షలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సడలించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది హిమాలయ దేవాలయాలను సందర్శించే యాత్రికులు రికార్డు స్థాయిలో రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.