coronavirus | న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు చేరింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం ఇదే తొలిసారి. అందరినీ కలవరపెడుతున్న కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు ఇప్పటివరకు 22 నమోదయ్యాయని, ఇందులో 21 కేసులు గోవాలో, ఒకటి కేరళలో నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
వీరంతా కోలుకున్నారని వెల్లడించారు. వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకలు, పండుగలప్పుడు జాగ్రత్త వహించాలని కోరారు. కేరళలో జేఎన్.1 కేసులు పెరిగే అవకాశముందని ఆ రాష్ట్ర వైద్య మంత్రి తెలిపారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని చెప్పారు.