ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ వెల్లడి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ మూలంగా ఊపందుకున్న కరోనా థర్డ్ వేవ్ ప్రస్తుతం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతున్నది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతోపాటు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో కొవిడ్ థర్డ్వేవ్ పీక్ స్థాయికి చేరిందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ చెప్పారు. ఐఐటీ సూత్రా మోడల్ ఈ మేరకు అంచనా వేసిందన్నారు.
అంతేగాక ఈ వారంలో మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పీక్ స్థాయికి చేరుకోనుందని మణీంద్ర అగర్వాల్ చెప్పారు. వారం క్రితం కూడా మణీంద్ర అగర్వాల్.. దేశంలో జనవరి చివరికల్లా కరోనా పీక్ స్థాయికి చేరుతుందన్నారు. గతంలో కంటే కొవిడ్ ప్రస్తుతం చాలావేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. దేశ ప్రజల్లో ఒమిక్రాన్కు వ్యతిరేకంగా తక్కువ వ్యాధి నిరోధకత కలిగిన వారు, ఎక్కువ వ్యాధి నిరోధకత కలిగిన వారు అని రెండు రకాలు ఉన్నారన్నారు.
ఒమిక్రాన్ ముందుగా ముందుగా తక్కువ వ్యాధినిరోధకత కలిగిన అందరిలో వేగంగా విస్తరించిందని, దాదాపుగా తక్కువ వ్యాధినిరోధక కలిగిన అందరూ ఇప్పటికే ఇన్ఫెక్షన్కు గురవడంతో ఇప్పుడు ఒమిక్రాన్ వేగం మందగించిందని చెప్పారు. ముందుగా ఒమిక్రాన్ను తక్కువ అంచనా వేయడం కూడా కరోనా థర్డ్వేవ్ విస్తృతికి కారణమైందని ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో జనవరి 19న పీక్స్థాయి నమోదవుతుందని, హర్యానాలో జనవరి 20న కొవిడ్ పీక్స్థాయికి చేరుకుంటుందని ప్రొఫెసర్ అగర్వాల్ చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో వచ్చే వారం కరోనా పీక్ స్థాయికి చేరుతుందని ఆయన తెలిపారు. కర్ణాటకలో జనవరి 23న, తమిళనాడులో జనవరి 25న, ఆంధ్రప్రదేశ్లో జనవరి 30న కొవిడ్ పీక్ స్థాయిలు నమోదవుతాయని వెల్లడించారు.