COVID-19 | దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఇన్ఫ్లుయెంజా సైతం ఆందోళనక కలిగిస్తున్నది ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైరస్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో రోగులు, వైద్యులతో పాటు ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు వ్యక్తులు రద్దీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో మాస్క్ వాడాలన్నారు.
కరోనా కథ ఇంకా ముగియలేదని, అందరూ అందరూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధరించుకునేందుకు దవాఖానల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. మైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని చెప్పారు.