Covid-19 Cases | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 126 రోజుల తర్వాత దేశంలో 800కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం దేశంలో కొత్తగా 841 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరింది. తాజా కేసుల దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,94,349కి చేరాయి. జార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు ఒక్కో కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు 4,41,58,161 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.80శాతం ఉండగా.. మరణాల రేటు 1.19శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 220.64 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. దేశంలో సగటు రోజువారీ కొవిడ్ కేసులు నెలలో ఆరురెట్లు పెరిగాయి.
సగటు రోజువారీ కొత్త కేసులు నెల కిందట ఫిబ్రవరి 28న 112 కేసులున్నాయి. ఇప్పటి 800కు చేరాయి. మరో వైపు పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు రాష్ట్రాలకు ఆరోగ్యశాఖ లేఖ రాసింది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు లేఖ రాసింది. పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, వ్యాక్సినేషన్పై దృష్టి పెట్టాలని సూచించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిర అవసరం ఉందని, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుందని సూచిస్తూ ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కేసుల పెరుగుదల ఆందోళనకరమైన అంశంగా అభివర్ణించిన ఆయన.. తక్షణమే వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.