Covid-19 | చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తీరు భారత్లోనూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కారణంగా ఆయా దేశాల్లో పరిస్థితి మరింత దిగజారుతున్నది. ఈ వేరియంట్ కేసులు భారత్లోనూ రికార్డయ్యాయి. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదుపులోనే ఉండగా.. గత 24గంటల్లో దేశంలో 185 మందికి కొవిడ్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మరో వైపు దేశంలో కొవిడ్ పరిస్థితులు, తదితర అంశాలపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పరిస్థితులు మరోసారి దిగజారుతున్న నేపథ్యంలో దేశంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదా? మళ్లీ లాక్డౌన్లాంటి పరిస్థితులు వస్తాయా? అని ఆందోళన చెందుతున్నారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఓసారి తెలుసుకుందాం..!
కరోనా ముప్పు మళ్లీ పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ టెస్టులు, చికిత్స, నిఘాను పెంచాల్సిన అవసరం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ వైద్యుడు డాక్టర్ అనిల్ గోయల్ తెలిపారు. మూడు డోసుల టీకా తీసుకున్నా అందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 95శాతం మందికి టీకాలు వేసిన చైనా కంటే.. భారత్ ప్రజల రోగనిరోధక శక్తి బలంగా ఉందని, జాగ్రత్తలు తీసుకుంటే దేశంలో లాక్డౌన్లాంటి పరిస్థితి ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ముంబైలోని జేజే హాస్పిటల్ డీన్ డాక్టర్ పల్లవి సాప్లే మాట్లాడుతూ.. చైనా సహా ఇతరదేశాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు టీకాలు వేయకపోవడం, నాణ్యమైన వ్యాక్సిన్ లేకపోవడం ప్రధాన కారణమని పేర్కొన్నారు. భారత్లో ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలు ఎక్కువ మంది టీకాలు తీసుకున్నారని, పరిస్థితి అదుపులో ఉంది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండడంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఒక్క కేసు నమోదైనా అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. కొవిడ్ పాజిటివ్గా తేలిన ప్రతి నమూనాకూ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. టీకాలు తీసుకోని వారు వెంటనే వేయించుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని, మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడే వ్యక్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
భారత్లో కొత్త వేరియంట్లు వచ్చినా ప్రజలు టీకాలతో రోగనిరోధకశక్తిని కలిగి ఉన్నారని ఢిల్లీకి చెందిన వైద్యుడు డాక్టర్ విక్రమ్జిత్ పేర్కొన్నారు. టీకాలు వేసిన వారికి కొవిడ్ సోకినా.. తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం మాస్క్, భౌతికదూరం తదితర నిబంధనలను పాటించాలని సూచించారు. వైరస్ బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్న వ్యక్తులు, పిల్లలు, వృద్ధుల్లో సమస్యలను పెంచుతుందన్నారు.
చాలాదేశాల్లో కొవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ విషయాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా వైరస్ బారినపడకుండా ఉండడంతో పాటు నివారించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకోండి.