న్యూఢిల్లీ : పంజాబ్లో 80శాతం కొవిడ్-19 కేసుల్లో యూకే వైరస్ వేరియంటేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా వైరస్ వ్యాప్తికి కారణాలు వివాహ వేడుకలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు నిరసనలేనన్నారు. ఈ మేరకు వైరస్ జన్యు శ్రేణిని గుర్తించినట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్లో కొవిడ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాజిటివ్ రేటు పది రెట్లు పెరిగిందని చెప్పారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్కు కేంద్రం 50 కేంద్ర బృందాలను పంపిందని తెలిపారు. బృందాలు మూడు నుంచి ఐదు రోజులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాయని చెప్పారు.